హైదరాబాద్, అక్టోబర్ 07 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తమను ఉద్దేశించి తాడు, బొంగరం లేనోడు అంటారా అని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఘాటుగా స్పందించారు. చర్చను వ్యక్తిగతం చేసి, సమాధానాలు దాటవేసిన ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం జేఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నిరుద్యోగం నుంచి నిర్వాసితుల దాకా మేం లేవనెత్తుతోన్న సమస్యలకు ముఖ్యమంత్రి కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. చర్చను వ్యక్తిగతం చేసి, దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు రెండు విడతల సీఎం ప్రెస్మీట్లలో ఇది రుజువైంది. ఏ ఒక్కరో పోరాడితేనో తెలంగాణ రాలేదు. కోట్ల మంది జనం, వేల కొద్దీ సంస్థల పోరాటంతో సాధించుకున్న రాష్ట్రమిది. ఇవాళ మా పోరాటం సామాజిక తెలంగాణ కోసం మాత్రమే. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించాలని మనవి చేస్తున్నాని కోదండరాం వ్యక్తం చేశారు.