హైదరాబాద్, అక్టోబర్ 07 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలపై టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాదులోని తెలుగుదేశం భవన్ లో ఆయన మాట్లాడుతూ... ప్రొఫెసర్ కోదండరామ్ ను నోట్టికోచ్చినట్లు మాట్లాడటం సరికాదని, ప్రజలు అధికారం అప్పగించగానే కేసీఆర్ సర్వం తానేనని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్షాల అనైక్యత వల్లే టీఆర్ఎస్ గెలిచిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఇంటికి కోదండరాం ఇల్లు ఎంత దూరమో కోదండరాం ఇంటికి కేసీఆర్ ఇల్లు కూడా అంతే దూరమని ఆయన గుర్తు చేశారు. పేదవారికి మేలు చెయ్యాలన్న టీడీపీ విధానం నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం మానేసి, తెలంగాణలో టీడీపీ లేదని అంటావా? అని ఆయన ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలంగాణ వీరులు, కోదండరాం దేశద్రోహా? అని ఆయన నిలదీశారు.