న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. కృష్ణ, గోదావరి నది యాజమాన్యం బోర్డుల పని తీరు, పరిష్కరించాల్సిన అంశాలు, వివాదాస్పదంగా ఉన్న విషయాలపై వివరాలు సమర్పించాలని రెండు బోర్డుల అధికారులను కేంద్ర జలవనరుల శాఖ కోరినట్లు సమాచారం. సంబంధిత మంత్రిగా నితిన్ గడ్కరీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ, ఆంధ్రపదేశ్ మధ్య ఉన్న నీటి వివాదాలను, బోర్డులను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అంశాల వారిగా నివేదికలు కోరడం సహా త్వరలోనే కృష్ణా, గోదావరి నది యాజమాన్యం బోర్డుల చైర్మన్లతో గడ్కరీ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు పరిధి ఖరారు చేయకపోవడం, కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను, అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.