విజయవాడ, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ దాడులు అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. తాజాగా ఏపీ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి జీవీ రఘు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ సూపరిడెంట్ నల్లూరి వెంకట శివప్రసాద్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డిఎస్పి రమాదేవి అద్వర్యంలో నిర్వహించిన సోదాలలో భారీగా అక్రమాస్తులను ప్రాధమికంగా గుర్తించారు. ఎన్వీ ప్రసాద్ కు చెందిన బంధువులు, సన్నిహితుల ఇళ్ళల్లో ఏక కాలంలో సోదాలు చేపట్టారు. విజయవాడ, మంగళగిరి, నెల్లూరు, విశాఖపట్టణం, చిత్తూరు, తిరుపతి, రాజానగరం, షిర్డీలో వీరికి భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 50 కోట్లకు పైగా ఆస్తులు, మంగళగిరి రఘు ఇంట్లో రూ.10 లక్షలు, గన్నవరంలో రియల్ ఎస్టేట్ వెంచర్, షిర్డీలో ఒక లాడ్జి, కృష్ణ జిల్లా వేల్పూరులో రెండెకరాల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. వీటి విలువ కొట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.