విజయవాడ, సెప్టెంబర్ 24 : హెల్మెట్ తప్పకుండా ధరించాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. కొంతమంది వాహనదారులు పెడ చెవిన పెడుతూ, ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తుండడంతో విజయవాడ పరిధిలో ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేస్తున్నట్లు నగర పోలీసు కమీషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. హెల్మెట్ ధరించిన వారికే పెట్రోల్ ను విక్రయించేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. ఒకవేళ వాహనదారులు ఈ ఆదేశాలను పాటించకపోతే వారికి జరిమానాలతో పాటు కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే వాహన తనిఖీలను కూడా కట్టుదిట్టం చేయనున్నట్లు ప్రకటించారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు ద్విచక్ర వాహనాలను ఇవ్వకుండా నిత్యం వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. అంతేకాకుండా వారింటి ముఖ్యులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిదేనని పోలీసు కమీషనర్ వెల్లడించారు.