అమరావతి, సెప్టెంబర్ 23 : తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ, తెలుగు రాష్ట్రాల కమిటీల వివరాలను నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో 17 మంది సభ్యులతో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పార్టీ పోలిట్ బ్యూరోలో గాని, జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసారు. అయితే పొలిట్ బ్యూరోలోకి కొత్తగా తెలంగాణ నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి, సీతక్కలను తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే టీడీపీ జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణరావు ఎంపికయ్యారు. ఏపీ టీడీపీ పార్టీలో 105 మంది సభ్యులతో, తెలంగాణ టీడీపీలో 114 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు బాబు తెలిపారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణతో ముందుకు సాగుతూ, ప్రజలకు మేలు కలిగేలా వారితో మమేకమై అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.