విజయవాడ, సెప్టెంబర్ 22 : బెజవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, డీజీపీ సాంబశివరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, వేకువజాము 3గం.ల సమయం నుంచి క్యూలైన్లో వేచియున్న సుమారు 15,000 మంది భక్తులు దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.