అమరావతి, సెప్టెంబర్ 20: ఏపీలో 11.92 వృద్ధి రేటును సాధించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అభినందించారు. ఈ వృద్ధి రేటు 15శాతం కావడం తన లక్ష్యమని ఆ దిశగా మరింత ముందుకు వెళ్ళాలని ఆయన సూచించారు. రెండు రోజుల పాటు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగే కలెక్టర్ల సమావేశాన్ని ఆయన నేడు ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తూ స్మార్ట్ వాటర్ గ్రిడ్ సాధన దిశగా అడుగులు వేయాలని ఆయనఆకాంక్షించారు. సాంకేతికతను ఉపయొగించుకోవడంలో రాష్ట్రం ఎప్పటికప్పుడు ముందుంటుందని తెలిపిన ఆయన ప్రపంచంలో అత్యుత్తమ విధానాలన్నీ ఇక్కడ అమలు కావాలని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చే బాధ్యత కలెక్టర్లదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు తొలగించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల సచివాలయంలో ప్రారంభించిన బయోమెట్రిక్ అటెండెన్స్ గురించి వ్యాఖ్యానిస్తూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఈ విధానం అవలంభించాలని, ఎవరికి మినహాయింపు లేదని ఆయన స్పష్టం చేశారు.