మెక్సికో, సెప్టెంబర్ 20: మెక్సికో నగరాన్ని భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 గా నమోదయ్యింది. దీని ప్రభావం వల్ల వందలాది మంది శిథిలాల క్రింద ఉండగా, ఇప్పటివరకు 226 మంది మృతి చెందినట్లు గుర్తించారు. ఘటన స్థలాలకు చేరుకున్న సహాయక సిబ్బంది పలువురిని రక్షించారు. ఈ భూకంప ప్రభావం వల్ల క్యూయెర్నవాకా ప్రాంతంలోని పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. దీంతో పాఠశాలలోని చిన్నారులు, ఉపాధ్యాయుల ఆచూకీ తెలియడం లేదు. నగరంలో అన్నీ చోట్ల విద్యుత్ లైన్లు, ఫోను లైన్లు ధ్వంసమయ్యాయి. ఈ భారీ భూకంపంతో భయందోళనకు గురైన ప్రజలకు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసా ఇచ్చారు. ఇదే నగరంలో 32 ఏళ్ల క్రితం 1985 సంవత్సరంలో సెప్టెంబర్ 19న పెను భూకంపం సంభవించింది. ఈ విపత్తులో అనేక వేల మంది ప్రాణాలను కోల్పోయారు.