హైదరాబాద్, జూన్ 5 : జూన్ 6వ తేదీ దగ్గుబాటి వంశీయులకు మాత్రమే కాదు సమస్త తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకమైన రోజు. నిర్మాతగా తెలుగు సినిమా కీర్తిని నలుమూలలా వ్యాపింపజేయడంతోపాటు, అత్యధిక భాషల్లో చిత్రాలు నిర్మించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సైతం చోటు సంపాదించుకొన్న ఏకైక నిర్మాత డి.రామానాయుడు పుట్టినరోజు. ఆయన దూరమైనా దగ్గుబాటి కుటుంబం మాత్రమే కాదు ఏ తెలుగు సినిమా అభిమాని ఆయన్ను మర్చిపోలేడు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా యువ కథానాయకుడు రామానాయుడు వారసుడు రానా తన తాజా చిత్రమైన "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ ను విడుదల చేయనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రానా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 6న రానా తన ట్విట్టర్ ద్వారా "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ ను విడుదల చేయనున్నాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. "తాతగారి జయంతి సందర్భంగా, "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ ను విడుదల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీజర్ తో సినిమాలో నేను పోషిస్తున్న జోగేంద్ర పాత్ర స్వభావాన్ని పరిచయం చేయనున్నాను" అన్నారు. చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. "రానా పర్సనాలిటీని మాత్రమే కాదు.. అతడిలోని నటుడ్ని పూర్తి వైవిధ్యంగా "నేనే రాజు నేనే మంత్రి" చిత్రంతో రీప్రజెంట్ చేస్తున్నాను. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రానా పాత్ర ఉంటుంది" అన్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. "రానా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". నాన్నగారి జయంతి కానుకగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు. రానా, కాజల్, అశితోష్ రానా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని, జెపీ, రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, ప్రభాస్ శీను, శివాజీ రాజా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.