దక్షిణకొరియా, సెప్టెంబర్ 16: తెలుగు తేజం, ఒలింపిక్ విజేత పీవీ సింధు ప్రతిష్టాత్మక కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్లో ఫైనల్ లో అడుగుపెట్టింది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోని 21-10, 17-21, 21-16 తేడాతో ఓడించి, ఫైనల్కు సింధు తన మార్గాన్ని సుగమం చేసుకుంది. అయితే గ్లాస్గో వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సిరీస్ ఫైనల్లో సింధుతో తలపడి విజయాన్ని కైవసం చేసుకున్న నోజోమీ నే ఈ టైటిల్ పోరులో కూడా తన ప్రత్యర్థి కావడం గమనార్హం. కాగా, అకానే యమగూచితో జరిగిన మ్యాచ్లో నోజోమీ ఒకుహారా సెమీస్ లో విజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సిరీస్లో ఓటమి పాలైన సింధు ఈ ఫైనల్ మ్యాచ్తో నోజోమీకు ధీటైన సమాధానమిస్తుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.