న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని కొన్ని బ్యాంకులు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరిగిపోతుండటంతో ప్రస్తుతం రుణాల కోసం వేచిచూస్తున్న వారికి ఏదో ఒక రూపంలో రుణం ఇవ్వాలనే ఆలోచనలో బ్యాంకులు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దగా హామీలు అక్కర్లేకుండా కొన్ని గంటల్లోనే రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రైవేటు రంగ౦లో అతిపెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐ మరో ఆఫర్ తో ముందుకొచ్చింది. అదేంటంటే.. తాజాగా గృహరుణం తీసుకునేవారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకూ అందుబాటులో ఉంచనున్నారు. ఈ పథకం ద్వారా గృహరుణం పొందాలనుకునే వారితో పాటు, వేరే బ్యాంకులో ఉన్న రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు బదిలీ చేసుకుంటే 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. కాని షరతులు వర్తిస్తాయి. కేవలం ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డును ఉపయోగించి రూ.30,000 కొనుగోళ్లు చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.