శ్రీకాకుళం, సెప్టెంబర్ 15: శ్రీకాకుళం జిల్లా పిన్నింటిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... వైసీపీ శ్రేణుల్లో భయం మొదలైందని, చంద్రబాబు నాయకత్వాన్ని వారు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతామంటూ తరచు తనకు ఫోన్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంత వరకు తనకు ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కాల్ చేశారని, ఇదే తరహాలో పలువురు టీడీపీ ముఖ్య నేతలకు ఇతర వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. దీనిపై పార్టీ సమావేశంలో చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని, అందుకే ముందుగా వైసీపీ ఎమ్మెల్యేలు మేల్కొంటున్నారని ఆయన అన్నారు.