సియోల్, సెప్టెంబర్ 15: ప్రపంచ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆటలో తనదైన శైలిలో దూసుకుపోతున్న భారత స్టార్ షట్లర్ పీవి సింధు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో గెలుపు కైవసం చేసుకున్న సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఐదో సీడ్ సింధు ప్రిక్వార్టర్స్లో 22-20, 21-17 సెట్లతో జిందాపోల్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. మరొప్రక్క ఇండియన్ షట్లర్ సమీర్వర్మ 21-19, 21-13 సెట్లతో వాంగ్ విన్సెంట్ (హాంకాంగ్)పై గెలిచి పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. మితాని మినత్సుతో సింధు, సాన్ వాన్తో సమీర్లు నేడు క్వార్టర్స్లో తలపడనున్నారు. కాగా, పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్ శెట్టిలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వీరు ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 9వ ర్యాంకు జోడీ అయిన హ్యు- లీ యాంగ్ (చైనీప్ తైపీ)లతో తలపడి విజయాన్ని సొంతంచేసుకున్నారు.