హైదరాబాద్, సెప్టెంబర్ 15 : ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన ర్యాలీ ఫర్ రివర్స్ అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. గవర్నర్ నరసింహన్, మంత్రి హరీష్ రావు, ఎంపీలు కేశవరావు, విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, సినీ సంగీత దర్శకుడు కీరవాణి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ సహా పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్పొరేట్ సంస్థలకు, నీటి వనరుల సంరక్షణకు తమ వంతు కృషి చేయాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. హరితహారం మిషన్ భగీరథ పథకాలతో జల వనరులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 39 నెలల పాలనలో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు నీటి సంరక్షణకు అనేక చర్యలు చేపట్టాయన్నారు. నీటిని దేవుని కానుకగా భావించి భూగర్భజలాలు పెరిగేలా చర్యలు తీసుకున్నాయని, ఈ మేరకు తెలంగాణలో మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ సంస్థలు కనీసం పది జల వనరులను దత్తత తీసుకొని వాటిని సంరక్షించాలన్నారు. ఈ నేపథ్యంలో నదుల రక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈషా ఫౌండేషన్ ప్రారంభించిన ర్యాలీ ఫర్ రివర్స్ కు పూర్తి మద్దతు ఉంటుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా స్పష్టం చేశారు.