సియోల్, సెప్టెంబర్ 15 : ఉత్తరకొరియా వ్యవహారం రోజు రోజుకి పిచ్చివాడి చేతిలో రాయి అనే చందంగా ఉంది. జపాన్ ను ముంచేస్తాం, అమెరికాను బూడిద చేస్తాం అంటూ, హెచ్చరికలు చేసిన ఉత్తరకొరియా మరో సారి జపాన్ పై క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి 2000 కిలోమీటర్ల మేర ఈ క్షిపణి ప్రయోగించినట్లు జపాన్ తెలిపింది. ఇది జపాన్ మీదుగా వెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో పడిందని వివరించింది. జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ నెల 3 వ తేదీన అత్యంత శక్తివంతమైన అణు పరీక్షను ఉత్తరకొరియా జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా వైఖరికి ఉపేక్షించబోమని జపాన్ ప్రధాని వెల్లడించారు.