ముంబయి, సెప్టెంబర్ 15: తన వికృత చేష్టలతో ప్రపంచ దేశాల విమర్శలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగం చేపట్టి నెల రోజులు గడవక ముందే మరో సారి జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం జరిపింది. దీంతో ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఢీలా పడ్డాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైన తీవ్ర స్థాయిలో పడింది. దీని కారణంగా నేటి ఉదయం దేశీయ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 61 పాయింట్ల నష్టంతో 32,180 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 10,058 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టాటాస్టీల్, వేదాంతా, సన్ఫార్మా, లుపిన్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బీహెచ్ఈఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.