చెన్నై, సెప్టెంబర్ 14: శ్రీలంక టూర్ తో విజయోత్సాహంలో ఉన్న టీమిండియా ఈ నెల 17నుండి వన్డే సిరీస్లో ఆసీస్తో తలపడనుంది. భారత్-ఆసీస్ల మ్యాచ్ ప్రేక్షకులను ఆద్యంతం రేపబోతుంది. ఈ నేపధ్యంలో 17న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్కు సంబంధించిన అన్ని టికెట్లు అప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ టికెట్లను జీఎస్టీ, వినోద పన్నులతో కలిపి మొత్తం ఏడు ధరల్లో విక్రయించినట్లు నిర్వహకులు వెల్లడించారు. కాగా, సాధారణ సమయానికంటే ఇంత త్వరగా టికెట్లు అమ్ముడుపోయిన ఈ స్టేడియం సామర్థ్యం 38వేలే కావడం గమనార్హం. ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్లో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా టీమిండియా కూడా అదే 117 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఆతిథ్య జట్టు శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా సొంతగడ్డపై ఆసీస్ తో ఏలా తలపడనుందో వేచి చూడాలి.