అమరావతి, సెప్టెంబర్ 13 : నంద్యాల ఉపఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి అఖిల ప్రియపై వైకాపా మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ దెబ్బకు బాబు అబ్బా అనాల్సిందే అని కామెంట్ చేసి, తీరా ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పరాజయం పాలవడంతో గత కొన్ని రోజులుగా రోజా మీడియాకు దూర౦గా ఉంటున్నారు. అయితే ప్రచారం సందర్భంగా అభ్యంతరకర పదజాలాన్ని వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ చుడీదార్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఓట్లను దూరం చేశాయనే భావన పార్టీ నేతల్లో ఉందట. ఈ కారణంగానే మీడియా ముందు వస్తే అధికార పార్టీ నేతల్లో విమర్శల పర్వం మొదలవుతోందని గ్రహించిన రోజా మీడియా ముందుకు రావడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.