హైదరాబాద్, సెప్టెంబర్ 13 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న "జై లవ కుశ" చిత్రంపై ప్రేక్షకులు భారీగా అంచనాలను పెంచుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేయడమే అందుకు కారణం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సంచలనాలను సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తై ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్ర నిర్మాత కల్యాణ్ రామ్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తయ్యాయని, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా, బోర్డు సభ్యులు అభినందించారని పేర్కొన్నారు. కాగా బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.