అమరావతి సెప్టెంబర్ 12: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. లగడపాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో చాలా సార్లు భేటీ అయ్యారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా పదే పదే లగడపాటిని బాబు ఎందుకు పిలిపించుకుంటారనే ప్రశ్న తలెత్తక మానదు. అయితే ఈ భేటీల వెనక రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని, కేవలం చంద్రబాబు ఆహ్వానం మేరకే ఆయన్ని కలిసానని లగడపాటి మీడియా ముందు చెబుతున్నా, ఈ భేటీ వెనక వీరిద్దరి మధ్య రహస్య మంతనాలేవో జరిగాయని, రాబోయే ఎన్నికల గురించి వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహం, వైకాపా ను ఎదుర్కొనే విధానం, తదితర అంశాల గురించి చర్చ జరిగినట్లు, పార్టీలోకి రాకపోయినా పర్వాలేదు గానీ, మా పార్టీకి పరోక్షంగా సహకారం అందించాల్సిందిగా బాబు కోరినట్టు, దానికి లగడపాటి ఒప్పుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.