ముంబై, సెప్టెంబర్ 12: రోజురోజుకీ సైబర్ నేరాలు శృతి మించిపోతున్నాయి. టోల్ గేట్ వద్ద పన్ను కట్టడానికి కార్డు స్వైప్ చేయగా కొద్ది సమయానికి ఖాతా నుండి మొత్తం నగదు కోల్పోయిన ఘటన పుణెలో వెలుగులోకొచ్చింది. దర్శన్ పాటిల్(36) అనే వ్యక్తి ఈ నెల 9వ తేదీన పుణెకు వెళ్తూ ఖాలాపూర్ టోల్ ప్లాజా దగ్గర తన డెబిట్ కార్డును ఉపయోగించాడు. అప్పుడు పాటిల్ కేవలం 230 రూపాయిలు మాత్రం టోల్ టికెట్కి చెల్లించాడు కానీ ఆ రోజు రాత్రిలోగా అతని అకౌంట్ నుంచి మొత్తం రూ.87 వేలు డెబిట్ అయినట్లు అతని మొబైల్కు మెసేజ్లు వచ్చాయి. అయితే వేర్వేరు సమయాల్లో అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు బాధితుడు వెల్లడించాడు. దీంతో దర్శన్ పాటిల్ హర్దాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. టోల్ ప్లాజాలో డెబిట్ కార్డు స్వైప్ చేయడం వల్ల సైబర్ నేరస్తులు దాన్ని హ్యాక్ చేసి ఉంటారనే అనుమానాలు వినిపిస్తున్నాయి.