ఢిల్లీ సెప్టెంబర్ 12: ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరైనా చట్టానికి అతీతంగా ఎలాంటి పదవులనైనా అలంకరించవచ్చనే విషయంతెలిసిందే. ఇప్పటివరకు చాలా మంది నాయకులు రాజకీయ వారసత్వాన్ని పొంది ఉన్నత పదవులను పొందిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజకీయ వారసత్వంలో మునిగిపోయిందని, కుటుంబ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ స్థావరంగా మారిందని మోడీ తో సహా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ విమర్శల పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. అమెరికా, బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దేశంలో అన్ని రంగాల్లో వారసత్వం కొనసాగుతోందని చెప్పారు. కరుణానిధి తనయుడు స్టాలిన్, ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ ఇలా చాలా మంది నాయకుల తనయులు రాజకీయాల్లో కొనసాగడం లేదా..? బీజేపీ కి కేవలం నేనొక్కడినే కనబడుతున్నానా..? అని మండిపడ్డారు. మన దేశంలో రాజకీయ వారసత్వం అనేది సర్వ సాధారణం. కాబట్టి కేవలం నన్ను మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ రాహుల్ వ్యాఖ్యలను పరిశీలిస్తే కేవలం వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తులు పదవులను అలంకరించడం సరికాదని బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ పై విధంగా మండిపడడం సరైనదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సామాజిక సమస్యలపై అవగాహన, సమస్యలపై స్పందించే నేర్పు, ఇలాంటి లక్షణాలు ఉంటే రాజకీయ వారసుడైనా అతనికి పదవులను కట్టబెట్టవచ్చు. కేవలం రాజకీయ వారసత్వం పేరుతో వ్యక్తులను రాజకీయ పదవులకు తగినవారు కాదని పార్టీలు ప్రచారం చేయడం సరైనది కాదనే విషయం గుర్తుంచు కోవలంటున్నారు విశ్లేషకులు.