న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: తనదైన శైలిలో బ్యాట్మింటన్ ఆటకు నిర్వచనం తెలిపి, బ్యాడ్మింటన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రకాశ్ పదుకొనే కి అరుదైన గౌరవం దక్కింది. ఆయన కృషికి గాను బ్యాడ్మింటన్ ఆటలో మొట్ట మొదటిసారిగా జీవిత సాఫల్య పురస్కార విజేతగా పదుకునే ని ఎంపిక చేసినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రకటించింది. ఈ గౌరవంలో భాగంగా జ్ఞాపికతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతిని ఆయనకు ప్రధానం చేయనున్నట్లు బీఏఐ అధ్యక్షుడు హిమంతా బిస్వా శర్మ వెల్లడించారు. ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం బ్యాడ్మింటన్ అభివృద్ధి కోసం పాటుపడిన వారికి జీవిత సాఫల్య పురస్కారం అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. న్యూఢిల్లీ వేదికగా ప్రకాశ్కి ఈ అవార్దు ప్రధానం చేయనున్నట్లు బీఏఐ అధ్యక్షుడు తెలిపారు. కాగా, 1980లో ఆల్ ఇంగ్లండ్, 1983లో ప్రపంచ ఛాంపియన్షిప్, 1978లో కామన్వెల్త్ క్రీడల్లో ప్రకాశ్ పదుకొనే పతకాలు కైవసం చేసుకున్న ప్రకాశ్ ను 1982లో పద్మశ్రీ అవార్డుతో, అంతక ముందు అర్జున అవార్డు తో సత్కరించడం జరిగింది.