విజయవాడ, సెప్టెంబర్ 12 : బీటెక్ విద్యార్థి పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని కృష్ణలంకలో చోటు చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రాజమండ్రికి చెందిన ఉపమాక శ్రీశివకార్తీక్ అనే బీటెక్ విద్యార్థి (21) కృష్ణలంకలో రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే ఇటీవల జరిగిన పరీక్షలు, సరిగా రాయకపోవడంతో మార్కులు తక్కువ వస్తాయని భయపడుతూ.. రెండు రోజుల క్రితం అతను ఉంటున్న రూమ్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా కార్తీక్ రూమ్ నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆ ఇంటి యజమాని మేడ పైకి వెళ్లి గమనించగా కార్తీక్ మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించగా, అక్కడకు చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబానికి సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్ట౦ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.