హైదరాబాద్, సెప్టెంబర్ 12 : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుంటే ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కష్టపడి సాధించుకున్న తెలంగాణ, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మజ్లిస్ కు తాకట్టు పెడతామంటే ప్రజలు సహించబోరని అన్నారు. ఆలాగే మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ ఒక కీలు బొమ్మలా మారిందని లక్ష్మణ్ విమర్శించారు. అయితే గతంలో కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసి, మరి ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ కు పట్టిన గతే టీఆర్ఎస్ కు పడుతుందని హెచ్చరించారు.