అమరావతి, సెప్టెంబర్ 12: ప్రజలను కుల, మతాల వారిగా విడదీసేందుకు వైసీపీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోందని, వాటిని ప్రజలు గమనించాలని సీఎం చంద్ర బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్కు మతిభ్రమించిందని, ఆయన మానసిక పరిస్థితి సరిలేదని అన్నారు. ఏపీ ప్రజలకు వైసీపీ అవసరం లేదని చెప్పారు. ఏమాత్రం అనుభవం లేని, చేతకాని ప్రతిపక్ష నేత జగన్ అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి పాటుపడుతున్నది కేవలం టీడీపీనే అని, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది వైసీపీ అని ఆరోపించారు. నంద్యాల ప్రచారంలో తనను ఉరి తీయాలని, బట్టలు ఊడతీయాలని వ్యాఖ్యానించిన జగన్, తాను ఏం తప్పు చేశానో, తెలపాలని కోరారు. ఇలాంటి మాటలతో ప్రతిపక్షనేత ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రజలు చాలా తెలివిగా తిప్పి కొట్టారని బాబు అన్నారు. చివరకు జగన్ ను ఎన్నికల కమిషన్ కూడా హెచ్చరించిందని... అయినా, అతనిలో ఏమాత్రం మార్పు రాలేదని మండిపడ్డారు. ఇలాంటి మతి స్థిమితం లేని వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని విమర్శించారు..