హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు శంషాబాద్లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ప్రసంగిస్తూ... ప్రజల వద్దకు వాస్తవాలను తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కోసం సొంత టీవీ ఛానల్, పత్రిక ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెరాస పార్టీ గురిచేస్తున్న వేధింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడవద్దని ఆయన సూచించారు. నలుగురికి మాత్రమే బంగారు తెలంగాణ సిద్ధించిందని, ఇదే కేసీఆర్ పాలన ఘనత అని ఉత్తమ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ చెప్పిన మోసపూరిత మాటల వలనే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలను సొంతం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు చాలా అవస్థలు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించే బస్సు యాత్ర కార్యక్రమంతో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన మండిపడ్డారు.