హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నేడు శంషాబాద్లో శిక్షణ తరగతులు విర్వహించారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన భాజపా, తెరాస లపై మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశానికి అతి ప్రమాదకరమైన శక్తులని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ, కేసీఆర్లు అబద్ధాలను ఆడటంలో ఒకరికి ఒకరు సాటి అని ఆయన ఆరోపించారు. ఎస్సీలకు మూడు ఎకరాలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటింటికీ నీళ్లను ఇవ్వలేరని, వచ్చే ఎన్నికల్లో ఓట్లనూ అడగలేరని ఆయన ఎద్దేవా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్, భాజపాతో జతకడతారని ఆయన జోస్యం చెప్పారు.