న్యూఢిల్లీ, సెప్టెంబర్ 08 : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అధిత్యనాథ్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివదాస్పదం అవుతున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని భావించిన యోగి నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు కొత్త విమర్శలు తెచ్చి పెట్టాయి. ఈ నెల 17న మోదీ జన్మదినం కాగా, ఆ రోజు ఆదివారం అయింది. ఆదివారం నాడు పుట్టిన రోజు వేడుకలు అన్ని పాఠశాలల్లో జరపాలని భావించిన ప్రభుత్వం, ఆ రోజు పాఠశాలలు తెరచివుంటాయని, విద్యార్థులు విధిగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా స్కూలుకు వచ్చి వేడుకల్లో పాలు పంచుకోవాలని రాష్ట్ర విద్యా మంత్రి అనుపమా జైస్వాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 1.60 లక్షల ప్రాధమిక పాఠశాలలు ఆదివారం పని చేయాలని తేల్చి చెప్పారు. దేశాభివృద్ధిపై మోదీ విజన్, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కలిగించేలా ప్రసంగాలుండాలని ఆమె తెలిపారు. ఈ ఉత్తర్వులపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి.