బెంగళూరు, సెప్టెంబర్ 07 : ప్రముఖ సీనియర్ మహిళా పాత్రికేయురాలు, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేశ్ రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఆమె నివాసం వద్ద హత్య చేయబడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేశ్ ఆఖరి కోరికను ఆమె సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ తీర్చారు. తాను చనిపోయిన తరువాత తన కళ్లను దానం చేయాలన్న ఆమె కోరిక మేరకు, బెంగళూరులోని మింటో ఆప్తాల్మిక్ ఆసుపత్రికి కళ్లను దానం చేశామని ఆయన వెల్లడించారు. తమ కుటుంబంలో ఇక అక్క లేదన్న బాధ, అక్క కళ్లను దానం చేయడం ద్వారా, మరొకరికి జీవితాన్ని ఇచ్చిన ఆనందం ఉందన్నారు. కాగా, గౌరీ లంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా పాత్రికేయ సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా ఆమె ఇంటిముందున్న సీసీటీవీ కెమెరాలను డీకోడ్ చేసిన సిట్ బృందం, ఆ ప్రాంతంలోని 100కు పైగా కెమెరాల ఫుటేజ్ ని అధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.