న్యూఢిల్లీ, సెప్టెంబర్ 07 : వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు రాష్ట్రాల యువత తమ సత్తా చాటుతూనే ఉన్నారు. ఈ తరుణంలోనే కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగుతేజం మరోసారి మెరిసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన రాగాల వరుణ్ 77 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ లు కలిపి వరుణ్ 269 కిలోల బరువును ఎత్తాడు. ఈ స్వర్ణంతో వరుణ్ ఇదే విభాగంలో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు డైరెక్టుగా అర్హతను సాధించడం విశేషం. తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎర్ర దీక్షిత, 58 కిలోల జూనియర్ విభాగంలో 167 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో స్వర్ణ పతకం సాధించిన వీరిని పలువురు ప్రముఖులు అభినందించారు.