అమరావతి సెప్టెంబర్ 6: 1994 ఎన్నికల్లో వైఎస్ఆర్, జేసీ రిగ్గింగ్ కు పాల్పడి గెలిచారా..? అంటే అవుననే అంటున్నారు రాయలసీమ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు, మాజీ టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. 1990 దశకం అంటే అప్పుడు టీడీపీ తిరుగులేని నాయకత్వం వహిస్తున్న రోజులవి. అప్పటికే కాంగ్రెస్ పాలనలో అలిసిపోయిన తెలుగు ప్రజలు భారీ మెజార్టీతో ఎన్టీఆర్ ను గద్దెను ఎక్కించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్, జేసీ రిగ్గింగుకు పాల్పడి గెలిచారని, లేకపోతే వారు కూడా ఓడిపోయే పరిస్థితి ఎదురయ్యేదాని ఆయన అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబంతో కూడా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో ముచ్చుమర్రికి పీవీ రావడంతో జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఓర్వలేక, తనపై కక్షగట్టి ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీ లో చేరానని వివరించారు. నిస్వార్థంగా, అవినీతికి తావు లేకుండా రాజకీయాలు చేశామని, బలహీనంగా ఉన్న పార్టీని బలంగా మార్చి అధికారంలోకి వచ్చామని అన్నారు.