హైదరాబాద్, జూన్ 4 : చాలా అరుదుగా కవల పిల్లలు జన్మనిస్తారు. వైద్యుల అంచనాల ప్రకారం ప్రతి పదివేల మంది జంటల్లో మూడు నుండి ఐదు శాతం జంటలకు కవలపిల్లలు జన్మించే అవకాశం, అదృష్టం ఉంటుంది. అయితే విధాన నిర్ణయం సమయంలో కవల పిల్లల విషయాన్ని ముఖ్యమంత్రి, అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం మరిచిపోయిందని స్పష్టం అవుతున్నది. అందుకు భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఘటనే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావు పేట మండలం వినాయకపురం కు చెందిన పఠాన్ షమీనాకు ఒకే కాన్పులో కవలలు ఆడ, మగ శిశువులు జన్మించారు. అయితే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లుకు అమ్మఒడి పథకం కింద ఒకే కేసీఆర్ కిట్ అందించారు. ఇద్దరు కవల పిల్లలను ఒకే పరుపుపై పడుకోబెట్టలేక..ఒకరిని పరుపు పైన...ఒకరిని నేలపైన పడుకోబెట్టలేని పరిస్థితి ఆ తల్లి కి ఎదురయ్యింది. కేసీఆర్ కిట్ ఖరీదయింది కావడంతో అలాంటి వస్తువులనే బయట మార్కెట్లో కొనుగోలు చేయడం తమలాంటి పేదవారికి కష్టమని, మరో కిట్ ఇవ్వాలని ఆ తల్లి నివేదించింది.