న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : బ్రిక్స్ దేశాల తొమ్మిదొవసదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు చైనా బయలుదేరనున్నారు. ఈ నెల 3 నుంచి 5 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకు రావాలన్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు షీయోమెన్ లో మోదీ 3 రోజులు పర్యటించనున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాభినేతలంతా సమావేశమై వేర్వేరు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. రానున్న 5 సంవత్సరాల్లో బ్రిక్స్ దేశాలు అనుసరించాల్సిన ఆర్థిక వ్యూహంపై సమాలోచనలు చేయనున్నారు. సిక్కిం సమీపంలోని డోక్లాంలో రెండు దేశాల సైన్యాల మోహరింపుతో 73 రోజులపాటు నెలకొన్న ఉద్రిక్తతలకు ఇటీవలే తెర పడినవేళ ప్రధాని చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జిన్పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు విదేశాంగ శాఖ సంకేతాలను ఇచ్చింది. అక్కడినుండి సెప్టెంబర్ 5న మోదీ మయాన్మార్ వెళ్లనున్నారు.