సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట!

SMTV Desk 2019-11-25 11:50:52  

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు విచారణ కోసం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ఈ కేసులో జగన్ దాదాపు 8 ఏళ్ల నుంచి విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జగన్ గతంలో 16 నెలల పాటు హైదరాబాద్‌లోని చర్లపల్లి జైల్లో గడిపారు. అనంతరం ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్.. ప్రతి వారం ఈ కేసు విచారణ కోసం న్యాయస్థానం ముందు హాజరయ్యారు. పాదయాత్ర చేపట్టిన సమయంలోనూ ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సి వచ్చేది. సీఎం అయిన తర్వాత వైఎస్ జగన్ పాలనా వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తాను ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నానని.. ప్రతి వారం కోర్టు ముందు హాజరు కావాలంటే.. ప్రభుత్వానికి రూ.60 లక్షలు ఖర్చవుతాయని జగన్ న్యాయస్థానానికి తెలిపారు. అందుకే వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును విజ్ఞప్తి చేశారు. జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు కాగా.. సీబీఐ కౌంటర్ పిటిషన్ వేసింది. జగన్‌ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. తొలుత సీబీఐ వాదనలతో న్యాయస్థానం అంగీకరించింది. దీంతో వైఎస్ జగన్ ఇక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలంటూ టీడీపీ, జనసేన ట్రోల్ చేశాయి. కానీ న్యాయస్థానం తాజాగా వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది.