ఆంధ్రజ్యోతి, ఈనాడుపై వైసీపీ ఎంపీ ఫిర్యాదు!

SMTV Desk 2019-11-22 13:35:25  

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రజ్యోతి, ఈనాడు మీడియా సంస్థలపై లోక్‌సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి ఫిర్యాదు చేశారు. అఖిలపక్ష సమావేశంలో తనపై హోంమంత్రి అమిత్‌ షా అసహనం వ్యక్తం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌, ఈనాడు, ఈటీవీల్లో వచ్చిన వార్తల్ని సభా హక్కుల కమిటీకి నివేదించాలని.. ఈ వార్తలు రాసిన విలేకరుల పార్లమెంటరీ పాసులు రద్దు చేయాలని కోరారు. తన పరువుకు నష్టం వాటిల్లిందని, పార్లమెంటు ప్రతిష్ఠ సైతం దెబ్బతినిందన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు అఖిలపక్ష సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా ఎంపీ విజయసాయిరెడ్డిపై అసహనం వ్యక్తం చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. తనపై తప్పుడు ప్రచారం జరిగిందని విజయసాయి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రికి ఫిర్యాదు చేశారు.. మీడియా సంస్థలపై చర్యల్ని తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఈ గోలాంతా ఎందుకు మన సాక్షి టీవీ సాక్షి పేపరు మాత్రమే వుండేలా చట్టం చేయమంటే పోలా అంటూ ఎద్దేవా చేశారు.