చంద్రబాబు , వైసీపీ ఎమ్మెల్యేల దీక్షలు... బందర్ రోడ్డులో భారీగా పోలీసుల మోహరింపు

SMTV Desk 2019-11-14 12:17:07  

ఏపీలో ఇసుక కొరుతకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే బాబు దీక్షకు పోటీగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి కూడా నిరసనకు దిగారు. బందర్ రోడ్డులో తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇసుక మాఫియా పేరుతో టీడీపీ తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలన్నారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికారు. దీంతో బందర్ రోడ్డులో ఉద్రిక్తత ఏర్పడగా.. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని భారీగా మోహరించారు. చంద్రబాబు ఇసుక పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని పార్థసారధి మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుకను దోచుకున్నారని.. చంద్రబాబు మతిపోయి దీక్షలు చేస్తున్నారన్నారు. తనపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేసిందని.. దీనికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ లబ్దికోసం ఇదంతా చేస్తున్నారని.. జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. తాను కూడా దీక్ష కోసం పోలీసుల్ని అనుమతి అడిగామని.. కానీ ఇవ్వలేదన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లు ఇసుకను దోచుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్లీ దీక్షలు చేస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. ఇసుక పేరుతో చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని.. ఇకనైనా నాటకాలు ఆపాలని విమర్శించారు. నదుల్లో వరద తగ్గిందని.. ఇక రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. రెండు రోజుల్లో 2 లక్షల టన్నులు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. టీడీపీ, చంద్రబాబు తప్పుడు ఛార్జ్‌షీట్‌ విడుదల చేసి దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈ కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వమన్నారు.