దాదాపు 40 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. దీంతో వారు విధులకు హాజరవ్వడమూ లేదు, ఇటు జీతాలు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా...తమ డిమాండ్లు, సమస్యల్ని పరిష్కరించాలని సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న కార్మికులకు హైదరాబాద్లో లాయర్లు బాసటగా నిలిచారు. తాము అండగా ఉన్నామంటూ ముందుకొచ్చారు.. తమకు తోచినంత సహాయం అందించారు.తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో.. సమ్మె కారణంగా జీతాలు అందక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. వారికి నైతికంగా తమ మద్దతు తెలిపారు. కోర్టు విధుల తర్వాత కాచిగూడ , బర్కత్ పురా డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మిక కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. కార్మికుల సమ్మెకు తమ సంఘీభావం తెలిపారు. మొత్తం 200 మంది ఆర్టీసీ కార్మికులకు ఐదు కిలోల చొప్పున బియ్యం ప్యాకెట్లు అందజేశారు. భవిష్యత్లోనూ ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.