హుజూర్నగర్ ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత చూపుతున్నారు. లెక్కింపునకు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్లు జరగనుంది. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, పరిశీలకుడిని నియమించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకుడు సచీంద్ర ప్రతాప్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రౌండుకు ర్యాండమ్గా రెండు ఈవీఎంల ఫలితాలు సరిచూసిన తర్వాతే.. ఫలితాన్ని వెల్లడిస్తున్నారు.లెక్కింపులో భాగంగా తొలుత ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ సర్వీసు ఓట్ల లెక్కించారు. తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండుకు 20 నిమిషాలు సమయం పడుతుంది. 21 రౌండ్లు పూర్తిస్థాయిలో, 22వ రౌండు పాక్షికంగా జరుగుతుంది. తుది ఫలితం మధ్యాహ్నం 12.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది.
హుజూర్నగర్ తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 2500పైచిలుక ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్కు 4 వేల ఓట్ల ఆధిక్యం.
మూడో రౌండ్ పూర్తియ్యేసరికి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 6,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హుజూర్నగర్లో పూర్తయిన నాలుగో రౌండ్ లెక్కింపు.. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి 9,356 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి 11 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి.
కాంగ్రెస్కు పట్టున్న నేరేడుచర్లలో 10 వేలకుపైగా మెజార్టీ ఓట్లు సాధించిన టీఆర్ఎస్.
ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థిపై 12,300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.
పూర్తయిన ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు.. 14,300 ఓట్ల వెనకంజలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి.
హుజూర్నగర్లో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 17వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోన్న టీఆర్ఎస్.
ఏకపక్షంగా సాగుతున్న హుజూర్నగర్ ఓట్ల లెక్కింపు ఫలితాలు. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి.
హుజూర్నగర్ ఉప-ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెండో స్థానంలో ఉండగా, బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఎదురయ్యింది.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. 2014 నుంచి కేసీఆర్కు దూరంగా ఉన్నామని భావించిన హుజూర్నగర్ ప్రజలు.. ఇప్పుడు టీఆర్ఎస్కు ఓటేసి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
తొమ్మిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 19, 200 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పదో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 20,100 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్కు పట్టున్న మేళ్లచెరువు మండలంలోనూ టీఆర్ఎస్ హవా కనబడింది.
హుజూర్నగర్ ఉప-ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ఏ మాత్రం ప్రభావం చూపలేదు. విపక్షాల ఆరోపణలను ఓటర్లు పట్టించుకోకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని ఆదరించారు.
పదకొండో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 21,618 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.