హైదరాబాద్, సెప్టెంబర్ 01: ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తుంది. ఉద్యోగాల కోసం ఏటా లక్షల మంది విద్యా సంస్థల నుండి బయటకి వస్తున్నా అందులో కొన్ని వందల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి మిగతా వారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. విద్యార్హత ఉన్నా ఉద్యోగానికి సరిపడా నైపుణ్యం వారిలో కరువవ్వడంతో కన్సల్టెన్సీ ల బాట పడుతున్నారు. వారేమో వీరి అవసరాన్ని అవకాశంగా మార్చుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి నుండి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. తీరా ఉద్యోగం రాకపోయే సరికి మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ పోలీసుల నుండి అయినా వారికి న్యాయం జరుగుతుందా..? అదీ లేదు వారు కూడా కన్సల్టెన్సీ ల చేతివాటానికి బాగా అలవాటు పడి ఈ తతంగాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. చివరకు నిరుద్యోగులు మాత్రం తమ వద్ద ఉన్న కాస్తో కూస్తో డబ్బులను కోల్పోయి చివరికి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సంఘటనలు మన దేశంలో ప్రతి రోజు ఎన్నో చోటు చేసుకుంటున్నా.. ఈ అక్రమాన్ని ఆపడం మాత్రం సాధ్యపడటం లేదు. ఈ సమస్యకు ప్రధాన పరిష్కార మార్గం ఏంటంటే.. అది అవగాహన మాత్రమే. పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ విషయం పై బహిరంగ సమావేశాల్లో అవగాహన కల్పిస్తున్నా యువత ఆలోచనల్లో మాత్రం ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనకు ఉద్యోగం రావాలంటే దానికి సంబంధించిన నైపుణ్యాన్ని పొందగలిగితే చాలు ఏ కన్సల్టెన్సీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదనే వాస్తవాన్ని గ్రహించగలిగితే చాలు మీరు కోరుకున్న ఉద్యోగం మీ వరమవుతుంది...!