కాకినాడ, సెప్టెంబర్ 01: నంద్యాల ఉప ఎన్నిక తర్వాత తెలుగు దేశం పార్టీ కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలపై ప్రధాన దృష్టి సారించిన విషయం అందరికీ విధితమే. అయితే అందరు ఊహించిన విధంగానే ఈ ఎన్నికల్లో సైకిల్ హవా కొనసాగుతుంది. మొత్తం 48 డివిజన్లలో ఎన్నికలు జరిగితే అందులో టీడీపీ 11 డివిజన్లలో విజయం సాధించి మరో ఏడు డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం కేవలం రెండు డివిజన్లలో గెలుపొందగా, మరొక స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది. ఆగస్ట్ 28 వ తేదీన జరిగిన నగర పాలక ఎన్నికల్లో 48 డివిజన్లకు గాను 241 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మొత్తం 1,48,598 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రావడంతో ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీని విజయ పథంలో నడిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.