టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న టీం ఇండియా స్టార్ బ్యాట్సమెన్ రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో మూడో టీ20 తర్వాత మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడిగా భారతమాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళితే .. ఇప్పటివరకూ ఎంఎస్ ధోని 98 మ్యాచ్లు ఆడితే, రోహిత్ తన తాజా మ్యాచ్ అనంతరం ఈ మార్కును చేరుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆటగాళ్లలో ధోని, రోహిత్ శర్మల తర్వాత స్థానంలో సురేశ్ రైనా ఉన్నాడు. రైనా ఇప్పటివరకూ 78 మ్యాచ్లు ఆడి మూడో స్థానంలో ఉండగా, కోహ్లి 72 మ్యాచ్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.