వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ కన్నా లక్ష్మీనారాయణ

SMTV Desk 2019-09-16 11:47:35  

ఈ ఉదయం గురజాలలో తలపెట్టిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడి పరిస్థితులపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన కన్నా, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బతికుందా? అని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. "ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా? పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడితే పోలీసులు గొంతునొక్కే ప్రయత్నం చేసి అక్రమ అరెస్ట్లు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిని వెనక్కి పరిగెత్తించి, కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన అజెండా" అని ఆరోపించారు. తమ నాయకుడిని అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.