ఉద్యోగులకు కొత్త చిక్కులు..!

SMTV Desk 2019-08-23 10:47:51  

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసిన 23వేల మంది కార్మికులను ప్రభుత్వం కిందటేడాది క్రమబద్ధీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నవారికి ఐదేళ్లకోసారి పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. ఓ గ్రేడ్‌లో కనీసం ఐదేళ్ల సర్వీసు ఉంటే దానికి పైన ఉండే గ్రేడ్‌కు పదోన్నతి కల్పిస్తామని చెప్పింది. గ్రేడ్‌ 4 ఆర్టిజన్‌గా ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి గ్రేడ్‌ 3 ఆర్టిజన్లుగా పదోన్నతి కల్పించనున్నారు. అలాగే మిగిలిన గ్రేడ్ లలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వనున్నారు. గ్రేడ్‌ మారితే ఆర్టిజన్ల వేతనాలు సైతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఆర్టిజన్లకు ఏక మొత్తం వేతనాన్ని మాత్రమే చెల్లిస్తుండగా, ఇకపై వారికి సైతం రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలో టీఏ, ఇంక్రిమెంట్లు, బోనస్, ఎక్స్‌గ్రేషియా, సెలవులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఇతర ప్రయోజనాలు వర్తింపజేయాలని రెగ్యులరైజ్ చేసిన సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ ను వర్తింపు చేయాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ఆ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థ ల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న 23 వేల మంది కార్మికులు, ఉద్యోగులను ఆయా విద్యుత్‌ సంస్థలు 2018, సెప్టెంబర్‌లో ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్నారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్లను 4 గ్రేడ్లుగా విభజించారు. తాజాగా ఆర్టిజన్ల కోసం విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ పేరుతో ముసాయిదా సర్వీస్‌ రూల్స్‌ను రూపొందించి రాష్ట్ర కార్మిక శాఖ ఆమోదం కోసం పంపించాయి. బదిలీల విషయం మినహాయిస్తే మిగిలిన అన్ని అంశాల్లో 4 విద్యుత్‌ సంస్థలు ప్రతిపాదించిన సర్వీసు రూల్స్‌ ఒకేలా ఉన్నాయి. ఈ ముసాయిదా సర్వీసు నిబంధనలపై ఆ శాఖ ప్రస్తుతం కార్మిక సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. కార్మిక శాఖ ఆమోదిస్తే ఈ సర్వీసు రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఆర్టిజన్ల కోసం ప్రత్యేక సర్వీస్‌ రూల్స్‌ రూపొందించడం తెలంగాణ విద్యుత్ శాఖలో ఇదే తొలిసారి. అయితే విద్యుత్ సంస్థలు తీసుకువచ్చిన స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం 15 రోజుల పాటు ఉద్యోగి ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అయితే ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. హెచ్ఆర్ఏ అవకాశం లేదు. పదవీ విరమణ తరువాత గ్రాట్యుటీ ఏమి ఉండదు, ప్రైవేటు ఉద్యోగుల మాదిరిగా వెరబుల్ డీఏ ఇస్తామని విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. ఆర్టిజన్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయడంలో కూడా వివక్ష చూపారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే ఇతర సదుపాయాలు కల్పించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.