కోల్కతా, ఆగస్ట్ 30 : బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ నటిస్తున్న "పరి" చిత్ర షూటింగ్ సమయంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కోల్కతా కరోల్బెరియాలో ఔట్డోర్ షూటింగ్ లో భాగంగా కరెంట్ షాక్ తగిలి బాలీవుడ్ టెక్నీషియన్ షా ఆలమ్ (28) ప్రాణాలు కోల్పోయారు. వివరాలలోకి వెళితే.. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఒక వెదురు చుట్టూ లైటింగ్ కనిపించేలా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ ప్రసారం అవుతున్న అక్కడి లైవ్ వైర్లలోని ఓ వైరును అతడు పట్టుకుని ఉండవచ్చని, దీంతో అతనికి షాక్ తగలవచ్చని అంతా భావిస్తున్నారు. షాక్ తగిలిన షా ఆలమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాదం వల్ల ఈ చిత్ర షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.