కామన్వెల్త్ గేమ్స్‌లోకి ఉమెన్స్ టీ20 క్రికెట్‌...సీజీఎఫ్ సంచలన నిర్ణయం

SMTV Desk 2019-08-13 17:09:34  

కామన్వెల్త్ గేమ్స్‌లోకి ఉమెన్స్ టీ20 క్రికెట్‌ని చేరుస్తూ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మెగా టోర్నీలో మొత్తం 8 దేశాలకి చెందిన మహిళా క్రికెట్ జట్లు పోటీపడనుండగా.. 1998 తర్వాత కామన్వెల్త్‌లో క్రికెట్‌ పోటీలు జరగనుండటం ఇదే తొలిసారి. ఉమెన్స్ క్రికెట్‌తో పాటు బీచ్ వాలీబాల్, పారా టేబుల్ టెన్నిస్‌ పోటీల్ని కూడా కామన్వెల్త్‌లో తాజాగా చేర్చారు. ఈ మేరకు 71 కామన్వెల్త్ గేమ్స్ అసోషియేషన్స్ తమ ఓట్ల ద్వారా అంగీకారం తెలిపాయి. వాస్తవానికి కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ని చేర్చాలని గత కొంతకాలంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ.. క్రికెట్‌‌కి ఉన్న ఆదరణ, ఆధిపత్యం.. మిగిలిన పోటీలపై ప్రభావం చూపుతుందని నిర్వాహకులు వెనకడుగు వేస్తూ వస్తున్నారు. తాజాగా ఉమెన్స్‌ టీ20 క్రికెట్‌ని చేర్చడంపై కూడా సుదీర్ఘ చర్చ తర్వాతే అంగీకారం తెలిపారు. 1998లో కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో చివరిగా ఫురుషుల క్రికెట్‌ పోటీల్ని నిర్వహించారు. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆ పోటీల్లో దక్షిణాఫ్రికా జట్టు బంగారు పతకం గెలుపొందింది. ఫురుషుల క్రికెట్‌కి ఉన్న ఆదరణ‌తో పోలిస్తే..? మహిళల క్రికెట్‌కి ఆదరణ చాలా తక్కువ. దీంతో.. టోర్నీలోని మిగిలిన గేమ్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని కామన్వెల్త్ నిర్వాహకులు విశ్వసించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మహిళల క్రికెట్‌కి ఆదరణ పెంచేందుకు గత కొంతకాలంగా శ్రమిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో కలిసి సీజీఎఫ్‌తో జరిపిన చర్చలు ఎట్టకేలకి ఫలించాయి.‘క్రికెట్ ప్రపంచంలో.. ముఖ్యంగా మహిళా క్రికెట్‌లో ఇది ఓ చారిత్రకమైన రోజు. కామన్వెల్త్‌లో ఉమెన్స్ టీ20 క్రికెట్‌ని చేర్చడాన్ని అందరూ ముక్తకంఠంతో అంగీకరించారు. కామన్వెల్త్ గేమ్స్‌కి టీ20 క్రికెట్‌ చక్కగా నప్పుతుంది. విశ్వ వేదికపై సత్తాచాటేందుకు మహిళా క్రికెటర్లకి ఇదో అద్భుత అవకాశం’ అని ఐసీసీ సీఈవో మను సాహ్నీ వెల్లడించాడు.