సిఎం కేసీఆర్ నేడు కుటుంబ సమేతంగా తమిళనాడులోని కాంచీపురం (కంచి) వెళ్ళనున్నారు. కంచిలో వెలిసిన శ్రీ అత్తి వరదరాజ పెరుమాళ్ నలబై ఏళ్ళకొకసారి 40 రోజులపాటు మాత్రమే దర్శనమిస్తుంటారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఈనెల 17వ తేదీ వరకు అవకాశం ఉంది. కనుక తమిళనాడుతో సహా దేశం నలుమూలల నుంచి రోజూ లక్షలాది ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొంటున్నారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న సిఎం కేసీఆర్ కూడా కుటుంబ సమేతంగా కంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోబోతున్నారు.
సోమవారం ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేకవిమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి మొదట తిరుమలకు వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. తరువాత తిరుమల నుంచి రోడ్డు మార్గాన్న కంచి చేరుకుంటారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తరువాత సోమవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.