ఆర్‌బీఐ మరో విప్లవాత్మక నిర్ణయం

SMTV Desk 2019-08-08 14:25:12  

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెట్ బ్యాంకింగ్ కస్టమర్లకు ఈ నిర్ణయం శుభవార్తే అనుకోవచ్చు . ఒకవేళ ఈ సౌలభ్యం అందుబాటులోకి వస్తే ఎప్పుడైనా, ఎక్కడైనాసరే ఆన్‌లైన్‌లో డబ్బులను ఇతరులకు పంపొచ్చు. అలాగే వారి నుంచి డబ్బులు పొందొచ్చు కూడా. ప్రస్తుతం యూపీఐ, ఐఎంపీఎస్ లావాదేవీలు మాత్రమే రోజులో ఎప్పుడైనా నిర్వహించగలం. ఇకపై నెఫ్ట్ కూడా వీటి జాబితాలోకి చేరనుంది. డిసెంబర్ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రావొచ్చు. పేమెంట్ సిస్టమ్ విజన్ 2021 డాక్యుమెంట్‌లో పేర్కొన్న విధంగా నెఫ్ట్ లావాదేవీలను రోజులో ఎప్పుడైనా నిర్వహించే సౌకర్యాన్ని 2019 డిసెంబర్ నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో దేశంలో రిటైల్ పేమెంట్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు రావొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) పేమెంట్ చెల్లింపులు అన్ని పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు, నాలుగో శనివారాలు ఇందుకు మినహాయింపు. అంటే ఈ సమయంలోనే నెఫ్ట్ మార్గంలో డబ్బులను ఇతరులకు పంపగలం. ఇకపోతే ఆర్‌బీఐ తన పాలసీ సమావేశంలో రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 5.4 శాతానికి దిగొచ్చింది. ఆర్‌బీఐ రేట్ల కోత ప్రకటన వెలువడిన వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా ఎంసీఎల్ఆర్ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.