గోదావరి నదిలో ఉట్టిపడుతున్న జలకళను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, మంత్రులతో కలిసి ఆస్వాదించనున్నారు. మంగళవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఉదయం ప్రాజెక్టును పరిశీలించి ధర్మపురికి చేరుకుంటారు. మధ్యాహ్నం లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొంటారు.
రెండు హెలికప్టర్లలో అధికారగణంతో సహా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన సాగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏరియల్ సర్వే తరవాత మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ ధర్మపురి పుణ్యక్షేత్రం చేరుకుంటారు. ఆ తరవాత 3 గం.లకు అధికారులతో కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారగణానికి ఘనస్వాగతం పలకడానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ధర్మపురికి చేరుకున్నారు. మరో మంత్రి ఈటల రాజేందర్ సీఎంతో పాటు స్పెషల్ చాపర్లో వెళ్లనున్నట్లు సమాచారం.